||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- అరువది ఐదవ సర్గ||

||'ప్రణమ్య శిరసాదేవ్యై '||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ పంచషష్టితమస్సర్గః||

తత్త్వదీపిక
అరువది ఐదవ సర్గ
'ప్రణమ్య శిరసాదేవ్యై '

'ప్రణమ్య శిరసా దేవ్యై ' అంటే
ఆ దేవికి నమస్కరించి అని.
హనుమ సీతా దేవికి ఆవిడ వున్న దిశలో నమస్కరించి
మళ్ళీ జరిగిన వృత్తాంతము చెపుతాడన్నమాట.
ఇప్పుడు రాములవారికి చెపుతాడు..

వానరులకు జరిగిన వృత్తాంతము చెప్పినప్పుడు కూడా
'ప్రణమ్య శిరసా దేవ్యై' అని వింటాము.
సీతాదేవిపై భక్తి పెరిగిన హనుమ ద్వారా ఇప్పుడు మళ్ళీ వింటాము.
ఈ సారి ఇది అంతా సీతమ్మ గురించే

ఇప్పుడు ద్వితీయమ్ తృతీయమ్ అంటూ
మొదటి సర్గలో విన్న, హనుమ చేసిన
దుష్కరమైన అంటే అసాధ్యమైన పనులను గురించి వినము.
మైనాక సురసా సింహికా లంకిణీ వృత్తాంతములను వినము.

ఇది అహం ప్రక్కనబెట్టి చెప్పిన కథ.
ఇది హనుమ యొక్క వినయము సూచిస్తుంది.
ఇది హనుమ ఉచితజ్ఞత ని సూచిస్తుంది.

ఇక్కడ మనము లంకా దహనము గురించి కూడా వినము.
ఇక్కడ అశోక వన ధ్వంశము మధువన ధ్వంశము గురించి కూడా వినము.

కాని ఈ రెండు వనముల ధ్వంశములో ఇంకో ధ్వని వస్తుంది.
అది జీవాత్మ పరమాత్మల కలయిక మీద.

ఈ రెండూ సముద్రానికి దక్షిణ ఉత్తర తీరములలో ఉన్నాయి.
రెండూ భోగ స్థానములే

ఈ లోకములో అనుభవించే సుఖములు లంకలో కనిపిస్తాయి.
శరీరమును పొంది ఆ సుఖములను అనుభవించుట పాప ఫలము.
స్వర్గాది లోకములలో భోగములను అనుభవించుట పుణ్య ఫలము.
ఈ రెండిటినీ ధ్వంశము చేశినపుడే భగవత్ సాన్నిధ్యము కలుగుతుంది.

స్వర్గలోకములో పుణ్యఫలము అనుభవించిన వాడు
అవి క్షీణించిన తరువాత మళ్ళీ మానవ జన్మ ఎత్తి
జరా మరణ వలయములో చిక్కుకొని వుండి పోతాడు.

ఇక్కడ రెండు వనములను ధ్వంశము చేసి
హనుమ రాముని చేరుట
పుణ్యపాపములను రెండింటిని ధ్వంశము చేసి భగవంతుని పొందుటను సూచిస్తుంది
అంటారు అప్పలాచార్యులుగారు.

ఇంకోమాట

వానరులు చిత్రమైన వనములు కల ప్రస్రవణ పర్వతము చేరి
మహాబలురు అగు రామ లక్ష్మణులకు నమస్కరించి
యువరాజును ముందు ఉంచుకొని
సుగ్రీవునకు అభివాదము చేసి
రావణాంతఃపురములో నిర్బంధిచబడిన,
రాక్షసస్త్రీలచే భయపెట్టబడిన ,
రామునిపై అనురాగము కల సీత గురించి,
కాలపు గడువు దాటిపోయి వున్నవిషయము ,
తదితర విషయములు అన్నీ రాముని సన్నిధిలో చెప్పిరి.

అంటే ఇక్కడ అంతా చెప్పినది "వానరులు",
అన్వేషణలో విజయము సాధించిన హనుమ కాదు.
హనుమ తనకన్న పెద్దవారికి గౌరవము ఇచ్చువాడు.
వాళ్ళకి చెప్పవలసినది అంతా చెప్పిన వాడు కూడా.
ఇందులో హనుమ నిస్వార్థ స్వభావము కనిపిస్తుంది.

ఇదంతా వినిన రాఘవుడు మళ్ళీ అడుగుతాడు వానరులను.
"సీత ఎలాగ వున్నది?
దేవీ నా గురించి ఏమనుకుంటున్నది ?
వానరులారా వైదేహి గురించి ఇదంతా నాకు చెప్పండి" అని.

లంకలో సీతమ్మతో మాట్లాడినది హనుమఒక్కడే.
హనుమని "సీతావృత్తాంత కోవిదః" అంటాడు వాల్మీకి.
"సీతావృత్తాంత కోవిదః" అంటే
సీతావృత్తాంతము క్షుణ్ణముగా తెలిసినవాడు అని.
అదే హనుమ.
అప్పుడు వానరులు క్షుణ్ణముగా తెలిసిన హనుమను చెప్పమంటారు.

ఇక హనుమ శ్రీరాములవారికి చెప్పిన వృత్తాంతము విందాము.
ఇక హనుమ మాటలు.

"నేను సీతను వెదుకుటకొఱకై
నూరు యోజనములు వెడల్పు కల సముద్రమును దాటి వెళ్ళితిని.
అక్కడ ఆ దక్షిణ తీరమున లంక అనబడు రావణుని నగరము కలదు.
అక్కడ ఆ దురాత్ముడు నివశించుచుండెను.

ఓ రామా ! అక్కడ రావణాంతఃపురములో వున్న,
నీ పై మనస్సు ఉంచుకొని వున్న
అన్నిటినీ సన్న్యశించి జీవిస్తున్న,
సీతను నేను చూచితిని.

ప్రమదావనములో రాక్షస స్త్రీలచే రక్షింపబడుచున్న ,
మాటికీ మాటికీ భయపెట్టబడుచున్న ,
రాక్షస స్త్రీల మధ్యలో వున్న సీతను చూచితిని.

ఆ విధముగా దుఃఖములో ఉన్న,
దుఃఖము అనుభవించతగని దేవిని
రావణాంతః పురములో రాక్షస స్త్రీల మధ్యలో వున్న
ఆ దేవిని ఎలాగో అదృష్ట వశాత్తు చూచితిని.

ఒకే జడవేసికొని నీగురించే ఆలోచనలో ఉన్న,
భూమిమీద పడుకొని ఉన్న,
కాంతి విహీన అయి ఉన్న
సీతను ఎలాగో అదృష్ట వశాత్తు చూచితిని.

రావణునిపై విముఖి అయి వున్న ,
మరణించుటకు నిశ్చయించుకొనిన,
కాకుస్ఠునిపై మనసు వుంచుకొని ఉన్న
ఆ దేవిని ఎలాగో అదృష్ట వశాత్తు చూచితిని".

ఓ అనఘా ! నరశార్దూలా !
ఇక్ష్వాకు వంశ కీర్తిని నెమ్మదిగా గానము చేసి వినిపించి,
ఆమెకు నాపై విశ్వాసము కలిగింపబడినది.

అప్పుడు దేవితో సంభాషించి సమస్త విషయములు,
రామసుగ్రీవుల మైత్రి కూడా ఆమెకు తెలియ చేసితిని.
ఆమె యొక్క ఆచారములు నిష్ఠ
అదే విధముగా నీపై భక్తి చూచి
నాలో సంతోషము నెలకొన్నది.

ఓ పురుషోత్తమా ! నీ పై భక్తితో నిండిన కఠోర తపస్సులో ఉన్న
మహాభాగ్యవంతురాలూ జనకుని కుమార్తె అయిన
సీత నా చేత చూడబడినది.

ఓ మహాప్రాజ్ఞ ! చిత్రకూటములో
వాయసముపై జరిగిన వృత్తాంతము
ఒక గుర్తుగా నీకు చెప్పుటకు నాకు చెప్పినది.

జానకీ దేవి నాతో ,
" ఓ వాయుపుత్రా రామునకు
నీవు ఇక్కడ చూచినది అంతా విన్నవించుము " అని చెప్పెను.
"నా చేత రక్షింపపబడిన ఈ చూడామణి ఇవ్వతగును.
సుగ్రీవుడు వినునట్లు ఈ వచనములు చెప్పుము" అని ఈ విధముగా చెప్పెను.

"ఈ చూడామణి నా చేత పరిరక్షింపబడెను.
నా తిలకము చెరిగిపోయినప్పుడు
మణిశిలను అరగదీసి చెక్కిలి మీద రాశిన వాడవు.
అది జ్ఞాపకము చేసికొనగలవు. "

"ఓ అనఘా ఈ దివ్యమైన జలనిధిలో జన్మించిన చూడామణిని పంపిస్తున్నాను.
నిజానికి దీనిని చూచి నిన్ను చూచినట్లే సంతోషపడుచున్నదానను.
ఓ దశరథాత్మజ ! జీవితము ఇంకా ఒక మాసమే ధరించియుండుదానను.
రాక్షసులవశములో నున్న నేను ఒక మాసము దాటి జీవించియుండను".

'కృశించిపోయి వున్న ,
ధర్మము పాటిస్తున్న రావణాంతః పురములో బందీగా వున్న,
ఆడ లేడి వలె వికసించిన నేత్రములు గల
ఆ సీత ఈ విధముగా నాకు చెప్పెను'.

'ఓ రాఘవా ! ఏది ఏవిధముగా జరిగెనో
అది అంతా నీకు చెప్పితిని.
అన్నివిధములుగా సాగర జలములను
దాటు మార్గము మనము చూడవలయును'

వాయుపుత్రుడు ఆ రాజపుత్రులిద్దరూ స్వాంతన పొందినారని గ్రహించి
అప్పుడు ఆ అనవాలుగా ఇచ్చిన చూడామణిని సమర్పించి,
మొదటినుండి జరిగినది, సీతాదేవి చెప్పినది
అంతయూ క్రమము తప్పకుండా రామునికి తెలిపెను.

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది ಐదవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||